Pages

Friday, September 23, 2011

రోజు రోజుకూ ఉధృతం


 
 ధూం.. ధాం...
శనివారం, ఆదివారం 'పట్టాలపైకి'... 333 రైళ్లు రద్దు

222 ఎంఎంటీఎస్‌లు కూడా ... 55 దారి మళ్లింపు
శుక్రవారం అర్థరాత్రి నుంచి 48 గంటలు ఆటో బంద్
సమ్మెకు ఆర్టీసీ అధికారులు.. రోజుకు 11 కోట్ల నష్టం
ఆస్పత్రుల్లో 2 గంటలే ఓపీ.. కు.ని. ఆపరేషన్లు బంద్
కేటీపీఎస్ ఖాళీ.. ఏ క్షణమైనా 5,6 దశలు మూత
కరెంటు కొరత తీవ్రం.. ఇక అడ్డంగా కోతలు
సచివాలయంలో మంత్రి శ్రీధర్‌బాబుకు భంగపాటు
మీడియా సమావేశాన్ని అడ్డుకున్న ఉద్యోగులు
100 మంది సీమాంధ్ర నేతలను నరికేస్తాం: చంద్రశేఖర్
ఖమ్మంలో న్యూ డెమోక్రసీ సభ విజయవంతం

హైదరాబాద్, సెప్టెంబర్ 22 : సకల సమ్మె వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. సమ్మె సెగ సకల జనానికీ తగులుతోంది. ప్రజా రవాణాను దెబ్బతీసిన ఆర్టీసీ సమ్మెకు... శుక్రవారం అర్ధరాత్రి నుంచి 48 గంటల ఆటో సమ్మె తోడవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఆటోలు బంద్ చేస్తామని ఆటో మోటార్ కార్మికుల జేఏసీ ప్రకటించింది. రోడ్డు రవాణా మాత్రమే కాదు... శని, ఆదివారాల్లో రైల్ రోకోతో పట్టాలపైనా రాకపోకలు స్తంభించనున్నాయి. రైల్‌రోకో నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది.

55 ఎక్స్‌ప్రెస్‌లు, 176 ప్యాసింజర్, 102 పుష్పుల్ రైళ్లను రద్దు చేసింది. 49 ఎక్స్‌ప్రెస్‌లు, 14 ప్యాసింజర్లను పాక్షికంగా రద్దుచేసి... 55 రైళ్లను దారి మళ్లించింది. రాజధాని పరిధిలో 222 ఎంఎంటీఎస్ సర్వీసులను పూర్తిగా రద్దు చేసింది. వెరసి... బస్సు బంద్. ఆటో బంద్. ఎంఎంటీఎస్ రైలూ బంద్! బయటికి కదలాలంటే సొంత బండి ఉండాల్సిందే. లేదా... కాలికి పని చెప్పాల్సిందే! సింగరేణి నుంచి పది రోజులుగా బొగ్గు పెళ్ల కూడా కదలకపోవడంతో... థర్మల్ విద్యుదుత్పత్తిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశంలోని వివిధ రాష్ట్రాలకు వెలుగులు పంచే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)లో బొగ్గు నిల్వలు అడుగంటాయి. కేటీపీఎస్ 5, 6 దశల్లో కేవలం ఒకే ఒక్కరోజుకు సరిపడే బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే... ఏ క్షణమైనా ఈ యూనిట్లు మూతపడనున్నాయి. కేటీపీఎస్ ఓ అండ్ ఎం పరిస్థితి కూడా 'రేపో మాపో' అన్నట్లుగా తయారైంది. ఇప్పటికే... పల్లె నుంచి నగరం దాకా కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఈ కరెంట్ కట కట మరింత తీవ్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఓ అండ్ ఎం పరిస్థితి కూడా 'రేపోమాపో' అన్నట్లుగా తయారైంది. ఇప్పటికే... పల్లె నుంచి నగరం దాకా కరెంటు కోతలు అమలవుతున్నాయి. ఈ కరెంట్ కటకట మరింత తీవ్రం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

సకల సమ్మెలోకి రోజురోజుకూ కొత్త వర్గాలు వచ్చి చేరుతున్నాయి. తెలంగాణ మెడికల్ జేఏసీ సైతం శుక్రవారం నుంచి సమ్మెకు సై అంది. రోజూ ఉదయం 10:30 నుంచి 12:30 వరకు మాత్రమే ఓపీ చూస్తామని... నెలాఖరు తర్వాత కూడా స్పందన కనిపించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ ప్రకటించింది. శుక్రవారం నుంచి అన్ని ఆస్పత్రుల్లో కు.ని. శస్త్ర చికిత్సలూ బంద్ అని తేల్చి చెప్పింది. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో గురువారమే ఓపీ సేవలకు అంతరాయం కలిగింది. ఉదయం 8 గంటలకు తెరవాల్సిన ఓపీ విభాగాన్ని మధ్యాహ్నం 12 గంటలకు తెరవడంతో రోగులు నానా ఇబ్బందులు పడ్డారు.

ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు పూర్తిస్థాయిలో సమ్మెలో పాల్గొంటుండగా ఇకపై అధికారులూ సమ్మెలో భాగస్వాములు కానున్నారు. సమ్మెవల్ల ఆర్టీసీ రోజుకు రూ.11 కోట్లకుపైగా నష్టపోతోంది. తెలంగాణలోని 89 డిపోల నుంచి బస్సులు అస్సలు కదలడంలేదు. దీంతోపాటు... కోస్తాంధ్ర, రాయల సీమ సెక్టార్ బస్సులపైనా సమ్మె ప్రభావం పడుతోంది. దేవుడికీ సమ్మెతో తిప్పలు తప్పడం లేదు. తెలంగాణ అర్చకులు 27న ఆర్జిత సేవలకు బంద్ ప్రకటించారు. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ (అనంతపురం) దూరవిద్య విధానంలో నిర్వహించే పరీక్షలను తెలంగాణ ప్రాంతంలో వాయిదా వేసింది.

సకల జనుల సమ్మెకు మద్దతుగా గురువారం తెలంగాణ వ్యాప్తంగా భారీస్థాయిలో ప్రదర్శనలు, మానవ హారాలు జరిగాయి. భోజన విరామ సమయంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల జేఏ సీ ప్రకటించింది. సింగరేణిలో పది రోజులుగా జరుగుతున్న సమ్మెతో సంస్థకు రూ.250 కోట్ల నష్టం జరిగింది. కార్మికులు రూ.60 కోట్ల మేరకు వేతనాలు కోల్పోయారు. మరోవైపు... కార్మికులు ఎవరైనా విధులకు హాజరైతే కులం నుంచి బహిష్కరించాలంటూ తీర్మానాలు చేసినట్లు తెలుస్తోంది.

రాజుకుంటున్న రాజకీయం
'మేం చేస్తున్నాం! మీ సంగతేంటి?' అని ఉద్యోగులు ప్రశ్నిస్తుండటంతో... తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు సతమతమవుతున్నారు. మంత్రి శ్రీధర్‌బాబుకు సచివాలయంలోనే ఈ సెగ తగిలింది. మంత్రులు రఘువీరా రెడ్డి, వట్టి వసంత కుమార్‌లతో కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై శ్రీధర్‌బాబు విలేకరులతో మాట్లాడుతుండగా... తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. 'మేం ఉద్యోగాలు వదిలిపెట్టి పోరాడుతున్నాం. మీకు ఆ బాధ్యత లేదా?' అని శ్రీధర్ బాబును నిలదీశారు. వాగ్వాదానికి దిగారు.

చివరికి... మంత్రి 'మీలో ఒకడిగా, తెలంగాణవాదిగా వచ్చేస్తున్నాను' అంటూ విలేకరుల సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. దీంతో ఉద్యోగులు 'శ్రీధర్‌బాబు జిందాబాద్' అని నినాదాలు చేశారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎ.చంద్రశేఖర్ కాంగ్రెస్ అధిష్ఠానంపైనా, సీమాంధ్ర నేతలపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "సమ్మె ఇంత ఉధృతంగా జరుగుతున్నా... ఢిల్లీకి కనిపించడంలేదు. ఇలాగైతే... హైదరాబాద్‌లోని సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు, బడా నేతల్లో వందమందిని ఊచకోత కోస్తాం. అప్పుడైనా ఇక్కడి పరిస్థితి తెలుస్తుంది'' అని పేర్కొన్నారు. ఉద్యమం బాగా వేడెక్కినప్పటికీ నిజామాబాద్ జిల్లా బాన్సువాడ బరిలో దిగాలనే కాంగ్రెస్ నిర్ణయించుకుంది. తమ అభ్యర్థిగా శ్రీనివాస్ గౌడ్‌ను ప్రకటించింది.

ఈ సందర్భంగా... కాంగ్రెస్ తెలంగాణతోపాటు ఏ వాదానికీ వ్యతిరేకం కాదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. టీఆర్ఎస్ తరఫున పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం నామినేషన్ వేయనున్నారు. బాన్సువాడలో పోటీపై టీడీపీ శనివారం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. అయితే... తెలంగాణకు సంబంధించి టీ-టీడీపీ నేతలు తమ స్వరాన్ని మరింత పెంచారు. మూకుమ్మడి రాజీనామాలకు మరోమారు పిలుపునిచ్చారు. 28వ తేదీన తాము అసెంబ్లీలో రాజీనామా పత్రాలు పట్టుకుని సిద్ధంగా ఉంటామని ప్రకటించారు. ఇక... టీ-కాంగ్రెస్ నేతలపైనా రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యమకారులకు సమాధానం చెప్పలేక, అధిష్ఠానాన్ని ఎలా ఒప్పించాలో తెలియక వీరు గందరగోళంలో పడ్డారు.

సకల సమ్మెపై సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గురువారం ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎన్. రఘువీరారెడ్డి, దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ముఖ్యమంత్రి పేషీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సత్యనారాయణ, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, ఇతర అధికారులతో సమీక్షించారు. సమ్మె కారణంగా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలని, ఆస్పత్రుల్లో వైద్య సేవలకు ఎటువంటి ఆటంకాలూ లేకుండా చూడాలని ఆదేశించారు. గురువారం 400 బస్సులు తిరిగాయని ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసాదరావు ముఖ్యమంత్రికి తెలిపారు. శుక్రవారం తెలంగాణ ప్రాంత జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

source: andhrajyothy.com

No comments:

Post a Comment